19, ఆగస్టు 2024, సోమవారం

21వ భాగం : ధనా `ధన్’

  




`పదరా, పోదాం రాజు

  ప్రేమ సిన్మ చూడ

  పదరా పోదాం రాజు..  - ఓ సినిమాలోని పాటకి పేరడీ కడ్తూ హమ్ చేస్తూ సైగ చేశాడు విజయ బాబు. ఆ వెంటనే నేనూ ఓ పాట ఎత్తుకున్నాను...

`పద పదరా చిన్నారి బాబు, 

`టైమ్కీ పక్షిలా ఎగురుకుంటూ 

`బుక్కు వైపు చూడకుండా, పద పదరా.. - అంటూ సై అంటే సైసై అన్నాను. నన్ను నందిగామలో చాలా మంది నాగరాజు అని అంటార్లేండి. 

అదేదో మాంచి ప్రేమ సినిమా అంటా, చూద్దాం పదరా అన్నాడు వాడు. రోమాంటిక్ సినిమాలను వాడలా పిలిచే వాడు. 

అది గుంటూరులోని అరండల్ పేట ఆరోవ లైన్ లో డాబా ఇంటిపైన ఉన్న ఓ చిన్న గది. ఆ ఇంటి యజమానులు బాచిలర్స్ కీ, స్టూడెంట్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ విషయం మా అన్నయ్యకు తెలుసు. ఇంటి ఓనర్ తో మాట్లాడి ఆ రూమ్ నెలరోజుల పాటు అద్దెకి తీసుకుని అందులో ముగ్గుర్ని పడేశాడు. అంటే ఆ గదిలోకి దింపాడన్నమాట. 

ముగ్గురిలో  మూడో వాడు ఉన్నాడే... వాడు `పుస్తకం చేతన్ బూని.. అన్నట్లుగా శ్రద్ధగా పుస్తకాలు చదువునే టైపు. వాడు డాక్టర్ అవుదామనే మాతో పాటుగా వచ్చేశాడు.  

అది 1976 సంవత్సరం. ఎండాకాలం. ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం మమ్మల్ని నందిగామ నుంచి `తోలుకొచ్చి  ఇదిగో ఈ గదిలో పడేశారు. అప్పటికే మా అన్నయ్యకు గుంటూరుతో బాగానే పరిచయం ఉంది. అలా అని నాకు లేదని కాదు. ఆనంద్ భవన్, శంకర్ విలాస్ , లక్ష్మీ టాకీస్, హరిహరమహల్, రంగ మహల్, శేష్ మహల్, మాజేటి గురవయ్య హైస్కూల్, హిందూ కాలేజీ, ఏసీ కాలేజీ వంటివి బాగానే తెలుసు. అప్పట్లోనే ధన్ కాలేజీ (రవి కాలేజీ) కూడా బ్రాడీపేటలో అటుగా పోతున్నప్పుడు చూశాను. కానీ లోపలకు వెళతానని మాత్రం అప్పట్లో అనుకోలేదు.  గుంటూరు గిరించి ఇన్ని విషయాలు మిగతా ఇద్దరికీ  తెలియవు. వాళ్లకు తెలియని ప్రపంచం నాకు తెలిసినందుకు ఆ కాసేపు నాకెంతో గర్వం అనిపించేది.  బోలెడు విషయాలు తెలుసు కనుక, అందునా రవి కాలేజీ కూడా తెలుసు కనుక అదరగోట్టేస్తానని అనుకున్నారు.  అందుకే అప్రకటిత నాయకుడ్ని అయ్యాను ఆ నెల రోజులూ. 

  గుంటూరులో ఉన్నప్పుడు మా ముగ్గురిలో నేనూ, బాబు చురుగ్గా తిరిగే వాళ్లం. `చదివే వాళ్లం అన్న పదాన్ని నిజాయితీగా చెప్పాలంటే వాడ బుద్ధి కావడం లేదు. అందుకే చురుగ్గా `తిరిగే వాళ్లం అన్నాను.

`నిజం చెప్పమంటారా? 

అబద్దం చెప్పమంటారా ?‘ – అని పాతాళభైరవిలో ఎన్టీఆరోడు అన్నట్లు అడగడం. పెద్దోళ్లేమో `నిజమే చెప్పండర్రా అని కోరడంతో  `గుంటూరులో మా సినిమా వినోదం గురించి పూసగుచ్చినట్లు చెప్పేవాళ్లం. ఇంట్లో వాళ్లు కొట్టలేదు, తిట్టలేదు. `కానీ, వీళ్లు డాక్టర్లు కాలేరు అని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత బీఎస్సీ, ఎమ్మెస్సీ ...ఇలా సాగిపోయింది చదువు. బాబు అయితే ఈ సైన్స్ నాకెందుకని అనుకుని ఆర్ట్స్ లో చేరిపోయాడు. వాడు బీఏ, నేను బీఎస్సీ వెలగబెట్టాము. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నందిగామ కాలేజీలో మేము మెరిట్ స్టూడెంట్స్ లిస్ట్ లోనే ఉన్నాము. ఎంతగా అంటే ఎమ్మెస్సీ సీట్ ఇచ్చిన యూనివర్శిటీ ఆఫ్ బొంబాయి (అప్పట్లో అలా పిలిచే వారు) వాళ్లు మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తూ కాలేజీలో చేరమని కబురు పంపారు. బీఎస్సీలో గ్రూప్ లో నాకు 72 శాతం మార్కులు వచ్చాయన్న మాట. కానీ ఇంగ్లీష్ లో మాత్రం అత్తెసరు మార్కులే.  

  అంతటి మెరిట్ స్టూడెంట్ అయిన నాకు ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం ఓ లెక్కా...ఇదీ నా ధీమా. అవతల  విజయబాబు, పార్థ సారధి (మూడో వాడు) అంతే ధీమాతో ఉన్నారు. అందుకే కదా మమ్మల్ని గుంటూరు రవి కాలేజీ (సీవీఎన్ ధన్ కాలేజీ)లో చేర్చింది. కానీ...

ఏం జరిగింది..

అసలేం జరిగింది 

 ఎంబీబీఎస్ కోర్స్ లో చేరాలంటే ఆ రోజుల్లో  ఎంట్రెన్స్ పరీక్ష తప్పని సరిగా వ్రాయాలి. అంతకు ముందు టెల్త్ క్లాస్ మార్కుల ఆధారంగా సీట్లు ఇచ్చే వారు. ఇప్పుడైతే మనందరికీ తెలుసు కదా, ఎంసెట్ పరీక్ష వ్రాస్తేనే అటు ఇంజనీరింగ్ లో అయినా ఇటు మెడికల్ కోర్స్ లోనైనా చేరేది.  గుంటూరు రవి కాలేజీలో ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ తో పాటుగా ఇంజనీర్ ఎంట్రెన్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు చేరేవారు. ఇలాంటి వారి సంఖ్య వందల్లో ఉండేది. క్లాస్ రూమ్ లన్నీ కిటకిటలాడేవి. ప్రధాన భవంతి చాలక ప్రక్కనే ఉన్న భవంతులను కూడా రెంట్ కి తీసుకునే వారు. 

  ఇక్కడ సివిఎన్ ధన్ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. అప్పట్లో నాకు వారి ప్రతిభ తెలియదు. కానీ ఆయన ఓ సింహంలాగా ఉండేవారు. (20వ భాగంలో సింహం నవ్వింది అంటూ నేను రామోజీ రావు గారి గురించి వ్రాశాను కదా. అలాగే ఈయనా ఓ సింహమే). ఆరడుగుల ఎత్తు గంభీరంగా ఉండే మోము. 




గుబురు మీసాలు. విద్యార్థులకు ఈయనంటే భయం. సీవిఎన్ థన్ గారి అసలు పేరు - చెన్నావఝుల విశ్వనాథన్.  వీరి స్వగ్రామం మా నందిగామకు దగ్గర్లోనే అంటే మునేరు దాటగానే వచ్చే రాఘవాపురం.  దాదాపుగా `మనూరు వాడే కావడంతో మా పెద్దోళ్లలో ఒకరిద్దరు ముందుగానే ధన్ గారిని కలిసి కాస్తంత ఫీజుల రాయితీతో మమ్మల్ని అక్కడ చేర్చారు. 

 

`ఆనంద భోజనం:

 

    మమ్మల్ని రూమ్ లో చేర్చడానికి ముందే రూమ్ అద్దె కట్టేశారు. ఇక మిగిలింది భోజనం ఖర్చు. దానికీ పెద్దోళ్లు ప్లాన్ చేశారు. డబ్బులు ఎక్కువగా ఇవ్వకుండా ప్లాన్ అన్న మాట. నెలకు సరిపడా లంచ్, డిన్నర్ టికెట్లు అంటే మనిషికి 60 టికెట్లు కొని ఇచ్చేశారు. 30 టికెట్లు కలిపి ఒక చిన్న బుక్ గా ఇచ్చేవారు. తలా రెండు టికెట్ బుక్స్ చేతిలోకి వచ్చి వాలాయి. ఇక మిగిలింది ఫలహార ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు అంతే. `పెద్దోళ్లు యమ తెలివిగలోళ్లు అని అనుకున్నాం. ఆనంద్ భవన్ లో రాత్రి డిన్నర్ కి లేటుగా వెళితే ఒక్కోసారి కర్రీ అయిపోతుంది. అయితే మాబోటి వాళ్ల కోసం  సెకండ్ కర్రీ (ఇది సహజంగా బంగాళ దుంప ఫ్రై అయి ఉంటుంది) చేసేవారు. హోటల్ లో చక్కటి అరటి ఆకులు పరిచి, చిన్న గిన్నెతో నెయ్యి (అతి చిన్న గిన్నండోయ్.. అసలు అలాంటి గిన్నెలు కేవలం హోటళ్ల వాళ్లకోసమే తయారు చేసే వారేమో) నెయ్యి కూడా కమ్మటి వాసన వస్తుండేది. రెండు కూరలు, పప్పు, అప్పడం,  బండ పచ్చడి, సాంబారు, రసం, గడ్డ పెరుగు... వీటితో తెల్లటి వరన్నం కలుపుకుని మద్యమధ్యలో నెయ్యి జార్చుకుంటూ తింటుంటే ఇంతకు మించి ఆనందం మరేముందనుకుంటూ `ఆనంద్ భవన్ సుఖీభవ అని అనాలనిపించేది. 

  క్లాస్ లు రాత్రి ఏడు గంటలకల్లా అయిపోతాయి. మరి అలాంటప్పుడు సకెండ్ కర్రీ దాకా ఎందుకు ఆగాలి. నిజానికి అక్కర్లేదు. కానీ ఒక్కో సారి క్లాస్ లు ఎగ్గొట్టి  ఫస్ట్ షో  సినిమాకు చెక్కేసినప్పుడు మరి సెకండ్ కర్రీ వేళే కదా అయ్యేది. అదన్న మాట అసలు సంగతి.  

  ఆనంద్ భవన్ ఇటు బ్రాడీపేట్ వాళ్లకీ, అటు అరండల్ పేట వాళ్లకీ అందుబాటులో ఉందిబ్రాడీపేట  ఏసీ కాలేజీల మధ్య రైల్వే ట్రాక్  కూడా ఉంది. అక్కడ ఒకప్పుడు మాన్యూవల్ గేట్ ఉండేది. రైలు వస్తున్నా, వెళుతున్నా గేట్ మూసేయడంతో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యేది. అక్కడో ప్లై ఓవర్ అవసరమని ఎంతగా మొత్తుకున్నా చాలాకాలం పాలకులకు పట్టించుకోలేదు. మా మామగారు (మన్నవ గిరిధర రావు గారు) కూడా ఫ్లై ఓవర్ అవసరాన్ని గుర్తు చేస్తూ ఓ వ్యాసం కూడా వ్రాశారని నా పెళ్లాయ్యాక మా ఆవిడ చెప్పింది. మొత్తానికి 60 దశకంటే ముందే అక్కడ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రాడీపేట వైపుకి వంతెన దిగుతుండగానే ఎడమ వైపున లక్ష్మీ టాకీస్ ఉంది. దాని ప్రక్కనే ఆనంద్ భవన్`గుంటూరు అంటే ఆనంద్ భవన్ అనే వారు నేటికీ ఉన్నారు. ఆ తర్వాత శంకర్ విలాస్ వంటి అధునాతన హోటల్ వచ్చినా ఆనంద్ భవన్ భోజనం ఒక సారి రుచి చూస్తే ఎప్పటికీ మరువలేము. ఆ రుచిని ఏకంగా 30 రోజుల పాటు చవిచూసిన అనుభవం మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. 

 

సివిఎన్. ధన్  - టిఎన్ బి. షన్:

 

 నేను ఆంధ్రప్రభలో చేరాక అక్కడో పెద్ద మనిషితో పరిచయం అయింది. వారి పేరు కందర్ప రామచంద్రరావు. ఆంద్రప్రభలో ఎడిట్ పేజీల వ్యాసాలు సరిచేస్తుండేవారు.  ఆయనోసారి సివిఎన్ న్ గురించి చెప్పారు. వారు చెప్పిన వాటిలో కొన్ని మాటలు మాత్రమే నాకిప్పుడు గుర్తున్నాయి. ధన్ గారి ఆలోచనలు భిన్నంగా ఉండేవి. రూరల్ ప్రాంతాల్లోని విద్యార్థులను వారు ప్రోత్సహిస్తుండే వారు. పల్లెల్లో చదువుకున్న పిల్లలు కూడా  డాక్టర్లు ,ఇంజనీర్లు కావాలని అనుకునేవారట. బెనారస్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రజాస్వామిక, జాతీయ భావజాలం కలవారు. ఎడ్యుకేషన్ ఫిలాసఫీని బాగా అర్థం చేసుకున్న మనిషి. ధన్ గారి జీవిత చరిత్రను వారి తమ్ముడు సిఎస్ రామచంద్ర మూర్తి `ధన్యాత్ముడుసీవీఎన్ ధన్  పేరిట పుస్తకం వ్రాశారు.   

ఆయన ఇంతటి వాడని తెలియని రోజుల్లో నేను ఆయనను చూశాను. నందిగామ నుంచి వచ్చిన మమ్మల్ని చూసి  `ఊ.. బాగా చదువుకోండి అని చాలా గంభీర కంఠంతో అన్నారు. 

 ధన్ గారి గురించి అప్పట్లో తెలియకపోయినా ఆయనను `ధన్ ..ధన్ అని పిలవడం నాకెంతో నచ్చింది. అది ఎంతగా అంటే, డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నెలవారీ పరీక్ష ఆన్సర్ షీట్ మీద నా పేరును TNB SHAN (టి. నాగభూ`షన్’) అని వ్రాసుకునేటంతగా. అక్కడితో ఆగలేదు. నా ఫ్రెండ్స్ సిహెచ్. పార్థసారధి, ఎం. విష్ణు వర్థన్ పేర్లను కూడా మార్పించాను.



 నా ప్రేరణతో పాపంవీరిద్దరూ కూడా ఆన్సర్ షీట్ల మీద  ChPS DHI (సిహెచ్ పార్ధసార`ధి’)  అని, MVV DHAN (ఎం. విష్ణువర్ `ధన్)అని మార్చేసి వ్రాశారు. మా జువాలజీ మాష్టారు డికేఎంగారు ఈ వింత పోకడను గమనించి మందలిద్దామనే క్లాస్ కి వచ్చి , `ధన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వ్రాశామనిగర్వంగా చెప్పగానే ఆయన ఫక్కున నవ్వేశారు. దీంతో క్లాస్ అంతా నవ్వుల మయం. ఆ తర్వాత తెలిసొచ్చింది...`అనుకరణ అనేది ఇలా కాదనీ వారి స్థాయికి ఎదగడంలో అనుకరించాలన్న సంగతి. 

 

కానీ ఏం చేశాము.. 

 

మాకూ డాక్టర్లు కావాలనే ఉండేది.  చక్కగా తెల్లటి కోటు వేసుకుని మెడలో  స్టెతొస్కోప్ తగిలించుకుని , మందుల చీటి వ్రాస్తూ  పేషెంట్లకు క్లాస్ లు పీకాలని నాకైతే మహ ఉబలాటంగా ఉండేది. అదేమిటో చిన్నప్పటి నుంచి  నాకో లక్షణం ఉంది. చిన్నప్పుడు బస్సు కండెక్టర్నీ, డ్రైవర్ ని చూసి నేనూ వాళ్లంతటి వాడినవ్వాలనుకున్నాను. మా ఊర్లో పోస్ట్ మాన్ ఇంటింటికీ లెటర్స్ ఇస్తుండే పద్ధతి బోలెడు నచ్చేసి నేనూ పోస్ట్ మాన్ అవ్వాలనుకున్నాను. కాలేజీలో లెక్చరర్ ని చూసి నేనూ అలా కావాలనుకున్నాను. కానీ ఇవేవీ కాలేదు. అనుకోకుండా జర్నలిస్ట్ ని అయ్యాను. సరే..

మమ్మల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దాలని పాపం రవీకాలేజీ లెక్చరర్స్ చాలా శ్రమపడ్డారు. వారి కష్టం చూసి నాకు జాలేసింది. ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పే ఆయనేతా మరీనూ. ఆయాస పడుతూ బ్లాక్ బోర్డ్ నిండా సూత్రాలు గట్రా వ్రాసేస్తూ నానా హడావుడి పడేవారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పడానికి ఒకటి రెండు సార్లు ధన్ గారు వచ్చినట్లు గుర్తు. మిగతా వాళ్ల మాట ఎలా ఉన్నా ఎప్పుడన్నా ధన్ వస్తే మాత్రం పిన్ డ్రాప్ సైలెంటే. ఆయన కారిడార్ లో కనిపించినా అంతే. ఆ తర్వాత తెలిసింది. వారు మరీ అంత సీరియస్ కాదట. ఆయనకు పిల్లలంటే ఇష్టమేనట. మా నాన్నగారు అంతేలేండి. పైకి గంభీరంగా ఉంటారు, లోపల మనసు మాత్రం వెన్న. 

 

చెప్పేది ఏమిటో..

 

ఒక్కో లెక్చరర్ వస్తున్నారు. పాఠాలు చెబుతున్నారు. నోట్స్ వ్రాసుకోమంటున్నారు. ఇరుకు ఇరుకు బెంచీల మీద , ఉక్కబోత .. ఆ పైన చెప్పేది బుర్రకెక్కక పోవడం. ఏమిటో అంతా గందరగోళం. క్లాస్ ల మధ్యలో నేను బాబుని అడిగాను. `ఏరా, నీకేమైనా అర్థం అవుతున్నదా వాళ్లు చెప్పేది  వాడు సమాధానం చెప్పలేదు. మరో ప్రక్కనే ఉన్న పార్థాని అడిగాను. వాడేమే ఒక సారి అడ్డంగా మరో సారి నిలువుగా తల ఊపాడు. ఇలా ఓ మూడు రోజుల పాటు శ్రద్ధగానే పాఠాలు విన్నాము. నాకో విషయం అర్థమైంది. 

పాఠాలు అవే, పుస్తకాలు అవే. 

కానీ నందిగామలో మేము మెరిట్ స్టూడెంట్స్ .

కానీ ఇక్కడేమో వెనకబడిపోతున్నాము. 

మాష్టార్లు అడిగే ప్రశ్నలకు కొంత మంది ఠకఠకా సమాధానాలు చెప్పేస్తున్నారు. 

ఎక్కడో లోపం ఉంది. 

ఎక్కడో తెలియడం లేదు. 

వారం గడిచే సరికి మాకు అర్థమైన విషయం ఏమంటే, మనం పుంజుకోలేము. కేవలం నెల రోజుల వ్యవధిలో ఎంత కష్టపడ్డా సీటు సంపాదించుకోలేము. కనుక .. కిమ్ కర్తవ్యంఈ గందరగోళ క్లాస్ లకు వెళ్తూ  టెన్షన్ పెంచుకోవడమా..? లేక `సినిమాలు గట్రా చూస్తూ మిగతా రోజులు కాలక్షేపం చేయడమా, ఏమిటి మన తక్షణ కర్తవ్యం?’

ఉన్నది ముగ్గురం. కానీ ఒక మాట మీద నిలబడలేకపోయాము. నేనూ, బాబు ఒక పార్టీ అయితే పార్థూ వేరయ్యాడు. అంటే, ఈ పార్థూ గాడు సినిమాలకు రానన్నాడు. `అయితే క్లాస్. లేకుంటే రూమ్..నాకైతేచదువే ముఖ్యం అన్నాడు కచ్చితంగా. `సరే, చెడిపోయేవాళ్లని ఏం చేస్తాము, నువ్వు పదరా’ అంటూ బాబు ..

`పదరా, పోదాం రాజు

 ప్రేమ సినిమా చూడగ  - అంటూ పాడేశాడన్న మాట. అదీ సంగతి. పార్థూని పుస్తకాలకు అప్పజెప్పేసి మేము రెడ్డెక్కాము. 

పార్థూ పూర్తి పేరు చవట పార్థసారథి. వీడి స్వగ్రామం నందిగామకు ఆనుకునే ఉన్న అనాసాగరం. వారి నాన్నగారి నందిగామలో బట్టల వ్యాపారి. సరే, విజయబాబుది నందిగామే. వీడి నాన్నగారు కస్తల పూర్ణేశ్వర రావు గారు నందిగామ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. పార్ధా  చాలా మంచి వాడు. ఎంతగా అంటే  రాముడు మంచి బాలుడు అన్నంత అన్న మాట. నేనూ, బాబు కాస్తంత అల్లరి బ్యాచ్ లో వాళ్లమే. సరదాగా మాట్లాడమూ, చిలిపి చేష్టలు చేయడం మాకిష్టం. ఈ విషయాల్లో వాడు సీరియస్. అందుకనే పార్థా  `చదువుకే నా ఓటు అన్నా మేమేమీ బాధపడలేదు.  మేము ఓక్కో థియేటర్ ఎక్కడుందో ఏ సినిమా ఆడుతుందో తెలుసుకుని చల్లగా జారుకోవడం మొదలెట్టాము. ఈ జారుకోవడంలో ఒక్కోసారి క్లాస్ లోంచి కూడానూ.  ముత్యాల ముగ్గు, అన్నదమ్ముల అనుబంధం, చీకటి వెలుగులు వంటి కొత్త సినిమాలతో పాటు సెకండ్ రీలీజ్ సినిమాలు, ఇంకా పాతవీ మొత్తంగా ఓ 11 సినిమాలు చూసేశాం. నందిగామ వెళ్ళాక ఈ విషయం మా ఫ్రెండ్స్ కి చెబితే `ఒరేయ్, ఇదో రికార్డ్ రోయ్. గిన్నీస్ బుక్ ఎక్కేశార్రోయ్ అంటూ ఎగతాళిగా అన్నా మేము పట్టించూకోలేదు. పైగా అలాంటి బుక్ ఎదో ఎక్కేసినట్లే తెగ ఫీలయ్యాము. మొత్తానికి ఎంట్రెన్స్ పరీక్ష వ్రాశాము. 

 తెలుగు మీడియంలో చదివిన వారికి తెలుగులోనే ప్రశ్నలు ఇచ్చారు. రవి కాలేజీలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కొన్ని సెక్షన్స్ ఉంటే తెలుగు మీడియం వారికి మరికొన్ని సెక్షన్స్ ఉండేవి.  చేరిన ప్రతి విద్యార్థికి చక్కటి శిక్షణ ఇవ్వాలన్నదే ధన్ గారి ఆశయం. వారి ఆశయం మంచిదే, కానీ మాకే చెప్పేది ఏమిటో, చదివింది ఏమిటో అర్థం కాలేదు. రవికాలేజీ మా శిక్షణ గురించి మా ఇంట్లో  కథలు కథలుగా తెలిసిపోయింది. గుంటూరులో ఉన్నప్పుడే ఓ సారి గమ్మత్తు జరిగింది. 

 

అదృష్టం కలిసొస్తే..

 

అసలు మేము చదువుతున్నామూ లేదా అనో, ఎలా చదువుతున్నామో చూద్దామనో - ఓ సారి మా నాన్నగారు ఇంకో ఆయనతో కలిసి గుంటూరు వచ్చారు. రాత్రి పది గంటలు దాటింది. మెట్ల మీద అలికిడి అయింది. ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వారిద్దరూ పైకి వచ్చారు. ఆ సమయంలో వారు చూసిన దృశ్యం వారి కళ్లలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఇంతకీ వారు చూసిన దృశ్యం..

 రూమ్ లో మూడు చాపలు పరిచి ఉన్నాయి. ఒక చాప మీద పార్థా పడుకుని నిద్రపోతున్నాడు. మరో రెండు చాపల మధ్యన పుస్తకాలు పరిచి ఉన్నాయి. అటూ ఇటూ నేనూ , బాబు నోట్స్ లు శ్రద్ధగా వ్రాసుకుంటున్నాము. మూడో వాడు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. 

  నాన్నగారు ఆ వచ్చిన పెద్దాయనతో అంటున్నారు...

`వీళ్లిద్దరూ బాగానే చదువుకుంటున్నారండి, సీట్లు రావచ్చు

కాసేపు ముచ్చట్లు చెప్పాక ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు.ఊర్లో ఈ వార్త పొక్కింది. మెరిట్ స్టూడెంట్స్ గా ముద్రపడిన ముగ్గురిలో ఇద్దరికి సీట్లు రావడం ఖాయమని అనుకున్నారు. 

అసలేం  జరిగింది... మేము ఆరోజున క్లాస్ లు ఎగ్గొట్టి మాట్నీ, ఫస్ట్ షో (రెండాటలు) చూసేసి, ఆనంద్ భవన్ లో సెకండ్ కర్రీతోనే ఫుడ్ లాగించేసి, హడావుడిగా రూమ్ కి వచ్చేసి, రోజున పార్థా క్లాస్ లో వ్రాసుకున్న నోట్స్ ని జాగ్రత్తగా మా నోట్ బుక్స్ లోకి ఎక్కిస్తున్నామన్న మాట.అప్పుడు పెద్దోళ్లు రావడం నిజంగా మా అదృష్టం.  ఆ క్షణంలోనే దేవుడ్ని ఇద్దరమూ పూర్తిగా నమ్మేశాం. ఆ తర్వాత ఎప్పుడో మేమిద్దరం తిరుమల వెళ్ళినట్లు గుర్తు. అంతే కాదు, అప్పుడు నాకనిపించింది, పార్ధూ మా బ్యాచ్ లో చేరకపోవడం మంచిదే అయింది. వాడు రెగ్యులర్ గా  క్లాస్ లకు వెళుతూ, నోట్స్ వ్రాసుకోవడం వల్లనే , వాటిని మేము చూసి వ్రాసుకునే అవకాశం రావడం వల్లనే ఈ గండం గడిచిందని వాడిని మెచ్చుకున్నాను. అందుకే పార్ధా అంటే నాకు బోలెడు ఇష్టం.  

 జీవితంలో చాలా పెద్దయ్యాక తెలిసింది ఏమిటంటే, అదృష్టం ఎప్పుడూ మనవెంటే రాదు. అది చాలా చంచలమైనది. లక్ష్మీదేవి లాగానే. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఇచ్చే ఆనందం శాశ్వతం. ఆనంద దాయకం. జీవన సాఫల్యానికి ఇదే  సరైన మార్గం.  విజయానికి దగ్గరి దారి ఉండదు. కానీ ఇలాంటి సూత్రాలు తెలుసుకునే లోపే జీవితంలో సగభాగం దాటిపోయింది. సరే, ఎంట్రెన్స్ ఫలితాలు వచ్చాయి.  మా ఇద్దరికీ సీటు రాలేదు. పార్థాకీ రాలేదు. మా కాలేజీలో ఒకడికి దివ్యాంగుల కోటాలో సీటు వచ్చింది. సర్లే, వాడన్నా పేరు నిలబెట్టాడని లెక్చరర్లు , ముఖ్యంగా సైన్స్ పాఠాలు చెప్పిన లెక్చరర్లు సంతోషపడ్డారు.   

అక్కడితో ఎంబీబిఎస్ డాక్టర్ కావాలన్న కోరిక చప్పబడింది. కానీ డిగ్రీ చదువుతున్నప్పుడే డాక్టర్ కోర్సు చదివే మరో అవకాశం వచ్చింది.  

 

హోమియో డాక్టర్ 

 

 నందిగామలో చదువుకుంటున్నప్పుడే నా మరో ఫ్రెండ్ విష్ణు వాళ్ల ఫాదర్ ఓ చక్కటి సూచన చేశారు. కానీ నాకు గానీ, వాడికి గానీ ఆ సూచన బుర్రకెక్కలేదు.  కాలేజీ చదువులప్పుడు  నందిగామలో ఎక్కడికి వెళ్ళినా నేనూ, విష్ణు , పార్థా కలిసే వెళ్ళే వాళ్లం. పార్ధాదేమో అనాసాగరం అని చెప్పాను కదా. ఇక మా ఇల్లు, విష్ణు ఇల్లు దాదాపుగా ఆనుకునే ఉండేవి. మేమిద్దరం చేసిన అనేక ప్రయోగాల గురించి `పలికింది ఆకాశవాణి ఛాప్టర్ లో వ్రాశాను కదా. 

ఆ రోజుల్లోనే విష్ణు వాళ్ల ఫాదర్  డాక్టర్ మేకపోతుల వెంకటపతి గారు మంచి లీడింగ్ హోమియో డాక్టర్. ఊర్లో ఉన్న శివాలయం, రామాలయం వద్ద దర్శనం కోసం వేచి ఉండే భక్తుల రద్దీ కంటే  ఈయన ఇంటి వద్ద ఎక్కువగాపేషెంట్స్ ఉండేవారని చెప్పుకునే వారు. ఇది నిజం కూడా. నందిగామ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అనేక మంది రోగులు , వారిని తీసుకువచ్చిన వారూ కలసి రోజూ కనీసం 50 మందైనా వస్తుండేవారు. డాక్టర్ వెంకటపతిగారు కామెర్ల వ్యాధికి చక్కటి మందు ఇస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు, పాము కాటుకి మందు ఇస్తే చిటికలో విషం దిగిపోతుందని కూడా గ్రామస్తులు అనుకునే వారు. సైన్స్ లో డిగ్రీ చేస్తున్న రోజుల్లో ఓ రోజు వారిని ఓ ప్రశ్న అడిగాను. `మీరిచ్చే హోమియో పిల్స్ కి నిజంగానే విషం దిగిపోతుందా?’ అని. దానికి ఆయన నవ్వుతూ - `చూడు నాగరాజు (నన్ను మా ఊర్లో రాజు అని, నాగరాజు అని కూడా పిలిచే వారు) పాములన్నీ విష పూరితం కావు. ఒకటి రెండు జాతులు మాత్రమే విషపూరితం. అవి కాటేస్తే  విషం నిమిషాల్లో తలకెక్కి మెదడు మొద్దు బారుతుంది. రక్త ప్రసరణ ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోనూ వచ్చు . దీంతో మనిషి మరణించ వచ్చు. అయితే చాలా మంది విషపూరితం కాని పాము కరిచినా తెగ భయపడిపోతుంటారు. వారి భయం వారి మెదడును మొద్దుబారిస్తుంటుంది. తమకు మృత్యువు తప్పదనుకుంటారు. ఈ రెండో రకం వారికి నేనిచ్చే పిల్స్ ఓ అపారమైన నమ్మకాన్ని, విషం దిగిపోతున్నదన్న భావనను కలిగిస్తుంది. అందుకే విషం ఎక్కిన సీరియస్ కేసైతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమంటాను. రెండో రకం వారిని మాత్రం ఈ మాత్రలు వేసుకుని ఇక్కడే పడుకోమంటాను. ఓ నాలుగు గంటలయ్యాక వారు తమకు ప్రమాదం గడిచిందని భావించి సంతృప్తితో వెనక్కి వెళ్ళిపోతారు. నమ్మకం ఉన్న చోటునే మందు పనిచేస్తుంది’  ఈ మాటలు నాకిప్పటికీ వేద మంత్రాల్లా అనిపిస్తాయి. 

  ఆ రోజుల్లోనే రాజమండ్రి హోమియో కాలేజీ బాగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత దాని పేరు అల్లు రామలింగయ్య హోమియో కాలేజీగా మారింది. పేరు మారక ముందే డాక్టర్ వెంకటపతిగారు మా ఇద్దర్నీ (నన్ను, విష్ణుని) ఓసారి పిలిచి, `రాజమండ్రి వెళ్ళండి , నేను చెబుతాను హోమియో కోర్స్ లో చేరండి అని హితవు పలికారు. ఎందుకో తెలియదు కానీ దాన్ని మేము వ్యతిరేకించాము. అయితే వాడూ నేను పిజీ చేశాక వాడి మనసు మారింది. అప్పుడు రాజమండ్రి వెళ్ళి హోమియో కోర్స్ పూర్తి చేసి డాక్టర్ విష్ణువర్ధన్ అయ్యాడు. ఇప్పుడు వాడు విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆధునిక హోమియో వైద్యం విషయంలో అనేక పరిశోధనా పుస్తకాలు చదువుతుంటాడు. 



ఆ మధ్యనే నేను ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు నాచేత కూడా ఓ నాలుగు పుస్తకాలు తెప్పించుకున్నాడు. కదిలిస్తే చాలు వాడెన్నో కేసులు మందుల గురించి అనర్గలంగా చెబుతుంటాడు.  

  ఇలా డాక్టర్ అవ్వాలన్న కోరిక, అవకాశం చేజారక నేను లెక్చరర్ అవుదామనుకుంటుండగా అనుకోని రీతిలో మలుపు తిరిగి (`ఈ పడవకెంత దిగులో ..’ అంటూ 9వ ఛాప్టర్ దీనికి సంబంధించిన విషయాలు చెప్పాను కదాఅలా) జర్నలిస్ట్ గా మారాను. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను. 

ధనా`ధన్ అంటూ ధన్ కాలేజీలో చేరినా, ఫటాఫట్ అంటూ పరీక్షలు వ్రాసినా మా ముగ్గురిలో (నేను, బాబు, పార్థా)ల్లో నేనేమో జర్నలిస్ట్ అయితే, విజయబాబేమో విజయవాడ లయోలా కాలేజీలో లెక్చరర్ నుంచి వైస్ ప్రిన్స్ పాల్ దాకా ఎదిగాడు. 



వీడు ఎన్. సి.సీ ఆఫీసర్ గా ఛీప్ మినిస్టర్ మెడల్ సంపాదించుకున్నాడు. అంతే కాదు, చక్కటి రచయిత కూడా.  ఇక పార్థా వ్యాపారంలోకి దిగాడు. కానీ బ్రెయిన్ ఫివర్ తో అకాల మరణం చెంది మాకెంతో దుఃఖం మిగిల్చాడు.  మరో సారి పార్ధాకీ నాకూ మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి చెబుతాను. పెద్దవాళ్లు మమ్మల్ని బైపీసీలో చేర్పించి డాక్టర్ అవుతారీ పిల్లలు అనుకున్నా ఎవ్వరమూ ఎంబీబీఎస్ డాక్టర్లు కాలేకపోయాము. అయినా జీవితంలో ఓ సాఫల్యత సంపాదించుకున్నాం. ఇది చాలు.  

(మళ్ళీ కలుద్దాం)

 

12, ఆగస్టు 2024, సోమవారం

20వ భాగం : సింహం నవ్వింది



సింహం నవ్వింది.. నవ్వదా మరి, 
ఓ ఎలుక వచ్చి గెంతులు వేస్తుంటే. 
వచ్చీరాని విద్యలు ప్రదర్శిస్తూ మెప్పించాలి అని అనుకున్నప్పుడు, ఇట్లాంటివి అప్పటికే ఎన్నో చూసిన ఆ సింహం నవ్వదా మరి. ఓ సింహాసనం లాంటి కుర్చీలో సింహం కూర్చుని ఉంది. భయం, భక్తి తెలియని ఓ ఎలుక తలుపు తోసుకుంటూ లోపలకి వచ్చింది. తన చిట్టి కళ్లతో అటూ ఇటూ చూసింది. అప్పుడు కనిపించింది ఓ గంభీర ఆకారం. ఆ ఆకారాన్నీ, ఆ వాతావరణాన్ని చూసి మహామహా ఉద్ధండులే భయపడతారట. కానీ అలా భయపడతారన్న జ్ఞానం ఈ ఎలుకకు లేదు కదా మరి..
  `దొరికింది భలే ఛాన్స్’ అని పాడుకున్నట్లుగా జోరుగా లోపలకు దూరింది. 


తన తెలివితేటలు, గొప్పతనం ప్రదర్శించి మెప్పు పొందాలనుకుంది. ఈ అమాయకత్వం చూసి సింహం అప్పుడు నవ్వింది. అయితే ఆ నవ్వు అట్టహాసంగా లేదు. అలాగాని వెటకారం గానూ లేదు. అదో రకంగా నవ్వింది. నిజానికి అది ఏ రకమైన నవ్వో ఎవ్వరూ కనుక్కోలేరు. ఆ నవ్వు వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో, మరెలాంటి ప్రతివ్యూహాలు దాగున్నాయో కూడా తెలుసుకోలేరు. అంత గుంభనంగా ఉండే నవ్వు అది. అసలు నవ్వుల్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలియని ఈ ఎలుక ఆ గంభీర సింహానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. 
    ఆ సింహం.. ఈనాడు పత్రిక యజమాని – రామోజీరావు. ఆ ఎలుక – మరెవరో కాదు, నేనే. ఈనాడు పత్రికలో అంతకు ముందే నేను వ్రాసిన వ్యాసం (గంగపుత్రుల వ్యధ) అచ్చయింది కదా. దీంతో మా ఊర్లో (నందిగామ) పెద్ద హీరోనైపోయాను కదా. సరిగా ఆ సమయంలోనే ట్రైనీ సబ్ ఎడిటర్ పోస్టులకు అభ్యర్థులు కావాలంటూ ప్రకటన వెలువడింది. ఈనాడు ఆదివారం సంచిక ఆ రోజుల్లో బుక్ లా కాకుండా పెద్ద సైజులోనే వస్తుండేది. ఇంకా తెలుగు పత్రికల్లోకి కలర్ యుగం రాలేదు అప్పటికి. అలాంటి రోజుల్లో నా వ్యాసం ప్రచురిత మయ్యాక కొద్ది రోజులకు ఈనాడు కార్యాలయం నుంచి ఓ లెటర్, దానితో పాటు వంద రూపాయల మనియార్డర్ వచ్చాయి. ఆ వంద రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియలేదు నాకు. సరే మిత్రులతో టిఫినీలు చేస్తూ కాఫీలు త్రాగుతూ కాలక్షేపం చేస్తుంటే ఇదిగో ఈ జాబ్ ప్రకటన ఒకటి. మిత్రుల ప్రోత్సాహంతో అప్లై చేశాను. ఈ విషయంలో విశాఖపట్నం మిత్రుల పాత్ర ఎక్కువనే చెప్పాలి. అప్పటికే వారి దృష్టిలో కూడా నేనే మేధావినయ్యాను. పైగా సివిల్స్ పరీక్షకోసం ప్రిపేర్ అవుతున్న రోజులవి. అప్పటి వరకు నా సైన్స్ సబ్జెక్ట్ తప్ప మిగతా సబ్జెక్ట్ పట్ల గొప్పగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సివిల్స్ అంటూ స్టడీ చేయడం మొదలుపెట్టానో జ్ఞాన ద్వారాలు ఒకటొకటి తెరుచుకోవడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యం నన్ను విపరీతంగా ఆకర్షించింది. వేమన, శ్రీశ్రీ, ప్రబంధాలు ..ఇలా ఒకటేమిటీ అన్నీ చదవాలన్న పట్టుదల వచ్చేసింది. సాహిత్యం పట్ల `పట్టు’ రాలేదు కానీ పరిచయం ఏర్పడింది. నాలుగు ముక్కలు మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాను. ఆ సమయంలోనే ఈనాడుతో పాటుగా ఆంధ్రప్రత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికలకు వ్యాసాలు పంపాను. వాటిలో కొన్ని అచ్చయ్యాయి. ఇస్లామిక్ కట్టడాల్లో హిందూ శిల్పశైలి, గ్రామదేవతల విశిష్టత ...వంటి వ్యాసాలు వ్రాసినట్లు గుర్తు. మా ఫ్రెండ్ విష్ణు దగ్గర ఓ క్లిక్ థర్డ్ కెమేరా ఉండేది. దగ్గర్లోని గ్రామదేవతా ఆలయాల వద్దకు వెళ్ళి ఫోటోలు తీసి ప్రింట్ తీసి ఇచ్చేవాడు.
  విష్ణు తర్వాత హోమియో డాక్టర్ అయ్యాడు. విజయవాడ లో ఉంటూ పేషెంట్స్ బాగోగులు (అదేనండి వైద్యం) అందిస్తుంటాడు. వాడు బోలెడు పేరు గడించాడు. 

 సరే,  ఇలా వ్యాసంతో పాటు ఫోటోలు కూడా పత్రికల వారికి పంపేవాడ్ని. ఈ వ్యాపకం నన్ను మరీ మరీ ఆకర్షించింది. నేనో గొప్ప రచయితనైపోయానన్న ఫీలింగ్ బలపడింది. అదిగో అప్పుడే ఈనాడులో ట్రైనీ సబ్ ఎడిటర్ పోస్టులు పడటం మనం అప్లై చేయడం , వాళ్లు పిలవడం, టెస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఇంటర్వ్యూ... ఈనాడు పత్రికని రామోజీరావు నడుపుతున్నారని తెలుసు. ప్రియా పచ్చళ్లు కూడా వారిదేనని తెలుసు. కానీ వారినెప్పుడూ చూడలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆయన వైపు , కాస్త భయం, కాస్త ధైర్యం, మరికాస్త తెగువ కలయడంతో తలెత్తి ఆయన కళ్లలోకి చూశాను. అమ్మో , ఆ కళ్లు చాలా చురుగ్గా ఉన్నాయి. ఆ గదిలో మరెవ్వరూ లేరు. నాకేమో ఆశ్చర్యమేసింది. మామూలుగా ఇంటర్వ్యూ అంటే కనీసం ఇద్దరో ముగ్గురో ఉండాలి కదా. మరి ఇదేమిటీ ఈనొక్కరే ఉన్నారు ! ఆయన్ని చూస్తుంటే నాకెందుకో సింహం గుర్తుకు వచ్చింది. అది ఇంటర్వ్యూ... భయపడకూడదు. నా తెలివితేటలు ప్రదర్శించి జాబ్ కొట్టేయాలి. ఇదీ నా ఆలోచన. కొద్ది గంటల ముందు జరిగిన వ్రాత పరీక్షలో వారిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ – వేమన పద్యాలనో, శ్రీశ్రీ కవితలనో, నన్నయ, తిక్కన వంటి కవుల ప్రస్తావనో తీసుకువచ్చాను. ఇది పెద్దాయన పసిగట్టారు. `నీకు తెలుగు అంటే ఇష్టమా..?’ `అవును’ (జాబ్ రావాలి కదా, ధైర్యంతో గట్టిగా చెప్పేశాను) `ప్రతి వ్యాసంలో వేమన, శ్రీశ్రీ వంటి వారిని కోట్ చేశావెందుకు?’ `వారంటే నాకిష్టం’ (అప్పటికి నేనేదో వీరాభిమాని అయినట్లు ఫోజొకటి) అప్పుడు.. ఆ సమయంలోనే.. సింహం నవ్వింది. ఎలుక గాభరా పడింది. `సరే వెళ్ళు’ అంది సింహం. `అమ్మయ్యా ...’ అనుకుంటూ ఎలుక బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆఫీస్ గోడకు ఓ లిస్ట్ అతికించారు. కొంత మందిని ట్రైనీ సబ్ ఎడిటర్స్ గా తీసుకున్నారు. అందులో ఈ `ఎలుక’ కూడా ఉంది. సంస్థలో ట్రైనీ సబ్ ఎడిటర్ అన్నది ఓ చిన్న పోస్ట్. ఆ పోస్ట్ కి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పత్రిక యజమాని స్వయంగా ఓ పది నిమిషాలు టైమ్ తీసుకోవడం నాకెంతో ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత తెలిసింది... సంస్థలో ప్రతి విషయం పట్ల ఆయన శ్రద్ధ పెట్టేవారని. అంతే కాదు, ఆయన చూపు `పునాది’ మీదనే ఉంటుంది. ఇదే వారి విజయరహస్యం. ఈనాడులో నేను పనిచేసింది ఎక్కువ కాలమేమీ కాదు. కనుక ఈనాడు అంతర్గత వ్యవహారాల గురించిగానీ, రామోజీరావు గారి వ్యవహార శైలి గురించి కానీ నాకు ఆట్టే తెలియవు. ఆ తర్వాత కూడా నేనెప్పుడూ వారిని చూడలేదు. రామోజీ ఇక లేరన్న వార్త చదివినప్పుడు నాకు ఆ నాటి సింహం-ఎలుక సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ దిగ్గజానికి ఇదే నా అక్షరాంజలి. ఈనాడులో మాకు చక్కటి శిక్షణ ఇచ్చారు. ఆ అనుభవాలు కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. `దానవీరశూరకర్ణ’ సినిమాకి డైలాగ్ లు వ్రాసిన కొండవీటి వెంకటకవి గారు వచ్చి క్లాస్ లు చెప్పేవారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు వరదాచారి గారు, పతంజలి గారు మాకు జర్నలిజంలో మెళుకువలు నేర్పారు. వీరిద్దరూ సౌమ్యంగా ఉంటూ మాలోని ప్రత్యేకతలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ఇంగ్లీష్ లో ఉన్న వార్తలను తెలుగులోకి అనువదించమనే వారు. ఓ సారి.. నేను సైన్స్ పిజీ అని తెలుసుకున్న పతంజలి గారు, ఓ సైన్స్ ఐటెమ్ (గ్రహాలు, రాకెట్ ప్రయోగం.. అంశాలున్నది) ట్రాన్స్ లేట్ చేయమన్నారు. నండూరి వారి `విశ్వదర్శనం’ చదివిన నాకు ఇది సులువనే అనిపించింది. ఓ పావుగంటలో వ్రాసి ఇచ్చాను. తర్వాత ఆయన పిలిచి – నేను అందులో వ్రాసిన ఒక పదం వద్ద ఎర్రటి ఇంకుతో రౌండ్ చుట్టారు. `ఇదేమిటి ?’ అని అడిగారు. `కక్ష’ – అన్నాను. `కక్ష కట్టినట్లుంది ’ - అంటూ నవ్వారు. అయినా నా బుర్ర వెలగ లేదు. అప్పుడు ఆయన నవ్వుతూ అసలు విషయం చెప్పారు. `గ్రహాలు కక్ష్యలో (ఆర్బిట్ లో) తిరుగుతాయి, అంతే కానీ కక్షలు, కార్పణ్యాల చుట్టూ తిరగవు’ అప్పుడర్థమైంది. నేను చేసిన తప్పేమిటో.. అప్పుడే మరో విషయమూ అవగతమైంది. తప్పు ఎత్తిచూపడంలో ఆయన చూపించిన సరళత ఎంత గొప్పదో. ఈ లక్షణం అందరిలో ఉండదు. అందునా అధికారంలో ఉండే వారిలో ఇది అడుగంటి అహంకారం బుసలు కొడుతుంటుంది. ఇంకో విషయం కూడా అర్థమైంది. తప్పులు చేయకుండా ఈ జర్నలిజంలో ప్రయాణం సాగించడం అసాధ్యమని. కానీ తప్పులు కాచే పెద్ద మనసు పై అధికారుల్లో ఉండవద్దూ.. ఆంధ్రప్రభలో వాసుదేవ దీక్షితులు గారు కూడా పెద్దమనసుతో తప్పులు సరిచేసేవారు. వారి మాటలనే ఆ తర్వాత నా జూనియర్స్ కి చాలా సందర్భాల్లో చెప్పాను. అదేమిటంటే.. `నువ్వు వంద తప్పులు చేయి. ఫర్వాలేదు. కానీ ఏ తప్పు రిపీట్ కాకూడదు’ ఈ ఒక్క సూత్రం పాటిస్తే తప్పులు రిపీట్ కాకుండా ఉండటమే కాకుండా కొన్నాళ్లకి అసలు తప్పులు లేకుండా పని చేయగలుగుతామన్నది ఆయన అందించిన సూత్రం. ఈనాడులో జర్నలిజం పాఠాలు నేర్చుకుంటున్నప్పుడే వరదాచారి గారు ఓ సారి - `నీ రచనా శైలి బాగుందోయ్, మంచి జర్నలిస్ట్ వి అవుతావు’ - అన్నారు. ఇలా ఎవరైనా పొగిడితే – నా కుడి చేయి లేచి ఎడమ భుజాన్ని తడుతుంది. ఇది నా మేనరిజం.. గతంలో చెప్పాను కదా. ఇప్పుడూ కుడి చేయి లేవబోయింది. కానీ బాగుండదని దాన్ని వెనక్కి దింపించాను. అసలు, ఈనాడులో చేరేవరకు నాకు సబ్ ఎడిటర్ అన్న పదవి చాలా గొప్పదని, ఎడిటర్ తర్వాత ఇదే అని భావించాను. నా లాజిక్ నాది. ఎందుకంటే, సబ్ ఎడిటర్ అయితే రేపు ఆ `సబ్’ కాస్తా ఎగిరిపోతుంది. అప్పుడు మనమే ఎడిటర్ – అన్న అమాయకత్వం అది. ఆ తర్వాత తెలిసింది. ఈ రెంటి మధ్యన ఎన్నో పోస్ట్ లు. మరెన్నో అంతరాలు...ఇంకెన్నో అడ్డంకులు. నా లాజిక్ కి అందని మ్యాజిక్ లు ఉంటాయన్న సంగతి. అమాయకత్వంతో జర్నలిజంలోకి ప్రవేశించిన నాకు మొదట్లో ఆనందాలు కంటే చేదు అనుభవాలే ఎక్కువ ఎదురయ్యాయి. అసలు ఈ వృత్తికి పనికి రావు అన్న వారూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ వృత్తి వదిలేద్దామని చాలా సార్లు అనుకున్నాను. కానీ పట్టుదల , కసి పెరిగిపోయాయి. ఎక్కడ పనికి రావని అన్నారో అక్కడే రాణించాలన్న పట్టుదలే - నా జర్నలిజం యాత్రని ఏకబిగిన 40ఏళ్లు నడిపింది. ఇప్పటికీ నడుపుతూనే ఉంది. ఈనాడులో పనిచేసిన రోజుల్లోనే ఇద్దరు ముగ్గురు మంచి మిత్రులయ్యారు. వారిలో జంధ్యాల శరత్ బాబు, తెలిదేవర భానుమూర్తి వంటి వారు ఉన్నారు. (మిగతా వారి పేర్లు వ్రాయలేదని వారు ఫీలవరని నేను ఫీలవుతున్నాను) జంధ్యాలతో ఇప్పటికీ ఆత్మీయ స్నేహబంధం ఉంది. తెలిదేవర భానుమూర్తి పైకి గంభీరంగా ఉన్నా మనసు వెన్న. అతనే బేగంపేటలో నాకు వాళ్ల ఫ్యామిలీ పోర్షన్ కి ప్రక్కనే ఉన్న ఒక గది ఇప్పించాడు. `బాచిలర్ బతుక్కి ఓ రూమ్ చాలుగా’ అనేవాడు. తెలిదేవర మాటలు, చేష్టలు నన్నెంతో ఆకట్టుకునేవి. తెలంగాణ మాండలీకంలో మాట్లాడుతుంటూ కృష్ణాతీరం నుంచి వచ్చిన నాకు చాలా మాటలు అర్థమయ్యేవి కావు. ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఈనాడులో చేరీచేరగానే రోజూ పొద్దున్నే కాంప్లిమెంటరీగా పేపర్ వచ్చి వాలేది. అదేదో గొప్పగా ఫీలయ్యాను. ఆరోజుల్లోనే ఈనాడు యాజమాన్యం ఇంగ్లీష్ పేపర్ ని కూడా తీసుకువచ్చింది. వాకాటి పాండురంగారావుగారిని ఎడిటర్ గా చేసింది. ఆ తర్వాత `సోమా’ ఫ్రూట్ డ్రింక్స్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈనాడు ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చారు. ఈనాడు ఆఫీస్ అప్పట్లో ఖైరదాబాద్ లో ఉండేది. అందుకే నేను బేగం పేటలో రూమ్ తీసుకున్నది. మా పెద్ద మామయ్య (కానూరి రామలింగేశ్వర రావు) వాళ్లు చిక్కటిపల్లిలో ఉండేవారు. వారం పదిరోజులకొకసారి మామయ్య వాళ్ళింటికి వెళ్ళేవాణ్ణి. ఇలా అదనంగా ఒక నెల జీతం వచ్చిందని చెబితే మామయ్య సంతోషిస్తూ, ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కోమని సలహా ఇవ్వడమే కాకుండా షాప్ కి తీసుకువెళ్ళి కొనిబెట్టారు. ఆ ఫ్యాన్ నా పెళ్లయ్యాక కూడా చాలా కాలం బాగానే పనిచేసింది. 2010 ప్రాంతంలో నేను టివీ5లో పనిచేస్తున్నప్పుడు మణికొండలో ఉండేవాళ్లం. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ అడిగితే ఆ ఫ్యాన్ ఇచ్చేశాము. గంగి గోవు పాలు.. ఆంధ్రప్రభ వాళ్లు పేపర్ లో ప్రకటన ఇస్తూ, పిజీ చేసిన వాళ్లకు ప్రయారిటీ ఇస్తూ `సబ్ ఎడిటర్ పోస్ట్ లు కావలెను’ అన్నారు. అది కూడా విజయవాడ ఎడిషన్ కి అని తేల్చి చెప్పారు. దీంతో అప్లై చేశాను. సివిల్స్ కి ప్రిలిమినరీ, మెయిన్ ఉన్నట్లుగా ఆంధ్రప్రభ వాళ్లు రెండు సార్లు వ్రాత పరీక్షలు పెట్టారు. మొదటి పరీక్ష ఇంటి నుంచే వ్రాసే వీలు కల్పించారు. నాలుగు టాపిక్స్ మీద వ్యాసాలు వ్రాయమన్నారు. అందులో సైన్స్, ఆధ్యాత్మికం, పొలిటికల్, యాక్సిడెంట్. పొలిటికల్ వ్యాసం వ్రాసేటప్పుడు ఎప్పటి లాగానే మిత్రుడు కస్తల విజయబాబు సలహాలు ఇచ్చాడు. సరే, నాలుగు వ్యాసాలు వ్రాసేసి పోస్ట్ చేశాను. వారం గడిచాక మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయనీ విజయవాడ రమ్మనమని కబురు అందింది. వెళ్లాను. ఆంధ్రప్రభ ఆఫీస్ (1984) విజయవాడ పూర్ణానందం పేటలో ఉండేది. ఇది రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర. బస్టాండ్ కి మరీ దూరం కాదు. అప్పట్లో బస్టాండ్ హోటల్ మమతా, దుర్గాభవన్ కి ఎదురుగా ఉండేది. బస్టాండ్ వల్ల ఈ రెండు హోటళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉండేవి. ఆ తర్వాత బస్టాండ్ మార్చేయడంతో ఈ రెంటి హవా తగ్గింది. ఆంధ్రప్రభ ఆపీస్ విశాలమైన ఆవరణలో ఉంది. ఈనాడులాగా నాలుగంతస్థుల భవనం కాదు. పైగా ఖైరతాబాద్ లాగా రద్దీ అయిన ప్రాంతంలో కాదు ఈ పూర్ణానందం పేట. ఏ రకంగా చూసినా హైదరాబాద్ తో పోలిస్తే విజయవాడ జీవనం సాఫీగా కూల్ గా సాగిపోతున్నట్లే నాకు అనిపించేది. అందుకే ఇప్పటికీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ (కోకాపేట)లో ఉంటున్నా నేనూ నా భార్య (శ్రీదేవి) విజయవాడ అంటేనే ఎక్కువగా ఇష్టపడతాము. ఆ మధ్య ఓ సారి విజయవాడ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రభ ఆఫీస్ ఉన్న పూర్ణానందం పేట రోడ్డు, అలాగే సత్యనారాయణ పురం చూసి ఏదో చక్కటి గాలి లభించిందన్న ఫీలింగ్ తో ఊపిరిపీల్చుకున్నాము. సత్యనారాయణపురంతో మాకున్న అనుబంధం గురించి విడిగా చెబుతాను. ఆంధ్రప్రభ ఆవరణ ముందు పెద్ద చెట్లు, లోపల దేవుడి గుడి, వాటి వెనుక రేకుల షెడ్లు కనిపించాయి. నాకెందుకో ఈ వాతావరణం సెట్ అవుతుందని అనిపించింది. నా సంకల్పాన్ని దేవుడు విన్నట్లున్నాడు. మెయిన్ పరీక్ష అన్నారు. మళ్ళీ ఇంతకు ముందులాగానే నాలుగైదు ప్రశ్నలు ఇచ్చారు. ఈ సారి లీగల్ ఐటెమ్, సినిమా ఐటెమ్ కూడా జతఅయ్యాయి. అప్పటికే కొద్దో గొప్పో అనుభవం ఉండటంతో వ్రాసిపారేశాను. నాలాగే చాలా మంది పీజీ వాళ్లు వచ్చారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాలో నా పేరు ఉంది. ఆవరణలోనే మరో ప్రక్క క్యాంటీన్ ఉంది. అక్కడ కూర్చోమన్నారు. ఈ క్యాంటీన్ తో ముందుముందు అనేక అనుభవాలు ఉండబోతున్నాయని నాకప్పుడు తెలియదు. నన్ను పిలిచారు. విశాలమైన రూమ్ లోకి వెళ్లమన్నారు. ఈ సారి ఎవరుంటారు లోపల. ఒకడే ఉంటారా.. లేక ముగ్గురు నలుగురు ఉంటారా .. లోపలకి అడుగు పెట్టాను. మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తు. ఓ పెద్దాయన పంచకట్టులో ప్రశాంత వదనంతో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నారు. వారి పేరు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసింది వారు – పొత్తూరి వెంకటేశ్వర రావు గారని. వారు అంతకు ముందు ఈనాడులో పనిచేశారట. నాకు తెలియదు. వారి ప్రక్కన వాసుదేవ దీక్షితులు గారు, అజంతా గారు, మరొకరు ఉన్నట్లు గుర్తు. `కూర్చోండి’ అన్నారు. మర్యాద ఇచ్చే మనుషులే సుమీ అనుకున్నాను. ఏవేవో అడిగుతున్నారు. చెబుతున్నాను. అంతలో పొత్తూరి గారు , `అబ్బాయి, ఈనాడు వదిలేసి ఆంధ్రప్రభలో ఎందుకు చేరాలనుకుంటున్నావ్...’ ఈ ప్రశ్నకు నా దగ్గర వెంటనే సమాధానం లేదు. అలా అని దాటేయకూడదు. సమాధానం చెప్పడానికి ఆట్టే వ్యవధి లేదు. `నాకు విజయవాడ అంటే ఇష్టమండి. మాది నందిగామ అండి. మా అమ్మ అనారోగ్యంతో ఉందండి. ఈనాడు వాళ్లు సెలవలు ఇవ్వడం లేదండి..అందుకే...’ నసిగాను. ఏదో పొంతన లేని మాటలు చెబుతున్నాను. `సెలవలు ఇక్కడ కూడా ఎక్కువ ఇవ్వరు తెలుసా...?’ `ఫర్వాలేదండి. వీక్లీ ఆఫ్ రోజునన్నా అమ్మను చూసి వస్తానండి.. దగ్గరే కదా’ మదర్ సెంటిమెంట్ పనిచేసిందేమో...ఏమో నాకు తెలియదు. జాబ్ మాత్రం వచ్చింది. ముహూర్తం మంచిదనుకుంటా.. ఆ క్షణం నుంచి మొదలైన ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్ లో పని దాదాపు రెండు దశబ్దాల పాటు సాగింది , ఎన్నో అనుభవాలను మూటకట్టుకుంటూ. ఇంటర్వూలో సెలక్ట్ అయినట్లు తెలియగానే ఆనందం వేసింది. బస్టాండ్ కి వచ్చి నందిగామ బస్సు ఎక్కాను. అప్పుడెందుకో వేమన పద్యం గుర్తుకు వచ్చింది... గంగిగోవు పాలు గరిటడైనను చాలు... ఇంటర్వూలు లేవు.. ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఎదుర్కున్న తరువాత నా కెరీర్ లో మరెక్కడా ఒక పద్ధతిగా జరిగే ఇంటర్వ్యూల్లో పాల్గొన లేదు. తెలుగు వన్ అయినా, టివీ ఫైవ్, తరంగా అయినా ఎక్కడా ఇంటర్వ్యూ అన్న భావన లేకుండా ఏదో స్నేహితుల కబుర్లలా సాగిన అవగాహనతోనే సెలెక్ట్ అయ్యాను. ఒక సారి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఎఫ్ఎం న్యూస్ఎడిటర్ గా ఉన్నప్పుడు న్యూస్ బులిటన్ తీసుకుని స్టూడియోలోకి వెళ్ళాను. ఆ టైమ్ లో ఎఫ్ ఎం స్టేషన్ నుంచి జ్యోతిష పండితులు వక్కంతం చంద్రమౌళిగారి కార్యక్రమం లైవ్ వస్తున్నది. నేను నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలకు వెళ్ళాను. ఆర్ జె కాసేపు అలా కూర్చోండి అన్నట్లు సైగలు చేశాడు. నేను శబ్దం రాకుండా ఓ కుర్చీలో కూర్చున్నాను. కాసేపు అయ్యాక ఈ కార్కక్రమం అయిపోయింది. ఇక అప్పుడు న్యూస్ టైమ్. ఆర్ జె తన ముందున్న మైక్ ని నా వైపుకు జరిపాడు. నేను వార్తలు చదివేశాను. అవి అయ్యేవరకు వక్కంతం గారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరం బయటకు వచ్చేశాము. అప్పుడు వారు నా గురించి అడిగారు. నేనే ఆంధ్రప్రభలో పనిచేస్తున్నాననీ, ఇది పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పాను. వారు చాలా సంతోషించి, `మీ ఆఫీస్ నేను చూడవచ్చా’ అని అడిగారు. రండి అని ఆహ్వానించాను. అన్నట్లుగానే వారు ఓ రోజు వచ్చారు. అప్పుడు నేను ఆంధ్రప్రభ – సండే మేగజైన్ సెక్షన్ లో పనిచేస్తున్నాను. వక్కంతం గారు వచ్చి నా ప్రక్కన కూర్చుని కాసేపు నా పనితీరు చూశారు. `చంద్రబాబుగారి మీద ఓ సెటైర్ కావాలండి మీరు సాయం చేయగలరా’ అని అడిగారు. `అలాగేనండి, దాందేముందీ’ అంటూ అరగంటలో కంప్యూటర్ స్కీన్ మీద టైప్ చేసి, ప్రింట్ తీసి ఇచ్చాను. వారు చాలా ఆసక్తిగా చదివారు. `బాగుందండి’ అని మెచ్చుకున్నారు. ఆ ప్రింట్ తీసుకు వెళ్లవచ్చా అని అడిగారు. అలా వారితో నా పరిచయం స్నేహంగా మారింది. ఓ నాలుగైదు రోజుల తర్వాత పొద్దున్నే అమెరికా నుంచి ఫోన్ కాల్. గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ ఓనర్ అరికట్ల వెంకట్ గారు అటు వైపు లైన్ లో ఉన్నారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్లుగా వారు నాతో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడి, వారి వెబ్ సైట్ లో రోజూ ఆర్టికల్స్ వ్రాసేలా అప్పటికప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా ఇది కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే వచ్చిని అవకాశం అని చెప్పడానికి ఈ సంఘటనను గుర్తుచేసుకున్నాను. తెలుగువన్ లో ప్రముఖ కార్టునిస్ట్ మల్లిక్ గారితో కలసి పనిచేయడం, టివీ 5లో కందుల రమేష్, కొమ్మినేని, బ్రహ్మానందరెడ్డి వంటి వారితో పరిచయాలు నా కెరీర్ లో ఉపయోగపడ్డాయి. ఆ విశేషాలు తర్వాత చెబుతాను. సింహం ఎదుట కుప్పిగెంతులు పెట్టిన ఎలుక తర్వాత ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంది. క్రమంగా జర్నలిజంలో తనకంటూ ఒక `మార్క్’ ని `బ్రాండ్’ ని సంపాదించుకుంది. దీనికి దశాబ్దాల తరబడి కృషి ఉంది. చివరి శ్వాస వరకూ శ్రమించడమే ఈ `ఎలుక’కి తెలుసు. ఇదే భగవంతుడు ఈ అల్పజీవికి ఇచ్చిన వరం. (మళ్ళీ కలుద్దాం)