బంగారు బాటలు వేసిన బాల్యం
—-
*సమాజ శ్రేయస్సు, సాంస్కృతిక వికాసమే సంకల్పం*
----
“ఓ జర్నలిస్ట్ కి అమ్మాయిని ఇస్తామంటే నేనొప్పుకోను'
అని అమ్మ అంటున్న మాటలు, `అది కాదే, జర్నలిస్ట్ కి సామాజికబాధ్యత ఉంటుంది. చూస్తుండూ, ఇతగాడు రేపో మాపో పెద్ద రచయితఅవుతాడు' అన్న నాన్న వాదన ప్రక్క గదిలో నుంచి వినబడుతూనేఉంది. ఏ బ్యాంకీ ఉద్యోగినో, ఏ సర్కారీ నౌకరీకో ఇచ్చి చేస్తే జీవితంసాఫీగా సాగిపోతుందన్నది అమ్మ లాజిక్. కానీ నాన్న మ్యాజిక్ గెలిచింది. “ఆంధ్రప్రభ” లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్ (తుర్లపాటి నాగభూషణ రావు)తో 1985 లో నా పెళ్లయింది. ఎందుకో తెలియదుగానీ నాన్న మాటలు చిన్నప్పటి నుంచి బోలెడు నచ్చేవి. సమాజానికిపనికొచ్చే పనులే చేస్తుండాలని నాన్న తరచూ ఇంటికి వచ్చిన వారితోచెబుతుండే వారు. నాన్న (మన్నవ గిరిధర రావు)గారు ఒక ప్రక్కనగుంటూరు హిందూకాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే అంతకంటేఎక్కువగా `భారతీయ మార్గం' మాస పత్రికకు ఎడిటర్ గానూ, “హిందూధర్మ వైభవం”, “కాంతి రేఖలు”, “పనికొచ్చే కథలు”, “ఎమ్మెల్యేఆత్మకథ” వంటి పుస్తకాలకు రచయితగా పేరుగడించారు. అవిభక్తఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి పూర్వ సభ్యునిగా సేవలందిచారు. నాన్న నాకిచ్చిన స్ఫూర్తితోనే శ్రీవారిని నేను రచనా రంగంలోనూ వివిధసామాజిక సేవా రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నాను. “
చాలా సౌమ్యంగా , ఆచి తూచి మాట్లాడే స్వభావం ఉన్న తుర్లపాటి శ్రీదేవి ని మొన్నీ మధ్య కలసి మీ జీవితంలో స్ఫూర్తిని నింపిందని ఎవరని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాటలివి. ఇక అమ్మ గారి గురించి అడిగితే …
అమ్మ దీవెన :
“నాన్నగారి మాటలు ఒక వైపున నాలో స్ఫూర్తిని నింపుతుంటే మరోవైపు అమ్మ ప్రేమ, దీవెన గృహిణిగా రాణించడానికి దోహదపడింది. జర్నలిస్ట్ ని అల్లుడిగా అంగీకరించనంటూ భీష్మించుకున్న అమ్మచివరకు అల్లుడిలోని మంచితనం చూసి ఎంతో ఆనందించింది. ఎప్పుడు ఇంటికి వచ్చినా మాకంటే ఆయనకే పెద్దపీట వేసేది. అమ్మ(లక్ష్మీ రాజ్యం) , బామ్మ (సామ్రాజ్యం) చిన్నతనంలో చెప్పిన జీవితపాఠాలను నేను ఎప్పటికి మరువలేను” అని శ్రీదేవి చెప్పారు.
*మీ పుట్టింటి విశేషాలు చెప్పండని అడిగితే..*
ఇల్లే స్వర్గసీమ :
“చిన్నతనంలో ఇల్లు అంటే స్వర్గసీమలా అనిపించేది. ఆత్మీయతలకు, అనుబంధాలకు ప్రతీకగా ఉండేది మా ఇల్లు. కొంచెం పెద్దయ్యాకగుంటూరులోని కృష్ణనగర్ లో విశాలమైన ఆవరణలో మాకోఇల్లుండేది. ముందువైపున మామిడి చెట్లు, కొబ్బరి చెట్లూ, వాటిమధ్యన పూల మొక్కలు..ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం. మొక్కలకు పాదులు తీయడం, వాటికి నీళ్లు పోయడం, అవిఎదుగుతుంటూ ఇంట్లో చంటి పాప ఎదుగుతున్నట్లుఆనందపడిపోవడం ..ఇవి తీపి గుర్తులు. “
మరి ఇంట్లో పని పాట? అనడిగితే…
పని నేర్పిన పాఠం :
“ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతున్నకొద్ది పని కూడా పెంచేవారు. అటునాన్నగారు అమ్మ, బామ్మ, మరో వైపున అన్నయ్య (మారుతీ ప్రసాద్) ఇంకా వచ్చి పోయే పెద్దలు - అందరికీ నేను తలలో నాలుక. `శ్రీదేవి ఈపని చేయి, శ్రీదేవి ఆ పని చేయి' అంటూ ఆర్డరీలు వేస్తుంటేచేసుకుంటూ పోతుండేదాన్ని. పనిలో ఆనందం అనుభవించడంఅప్పుడే అలవడింది. ఇప్పటి పిల్లలను చూస్తుంటే మేము ఇందుకుభిన్నంగా ఉన్నామనే అనిపిస్తుంటుంది. ఆ రోజుల్లో ఇంటి పని అంతాచక్కబెట్టాము కనుకనే పెళ్లయిన తర్వాత ఒంటరిగానే పనులుసమర్థవంతంగా చేయగలుగుతున్నామేమో”.
మీ నాన్న గారు పబ్లిక్ ఫిగర్ కదా, మరి పెద్దలెవరైనా మీ ఇంటికి వస్తుండేవారా?
ఎందరో మహానుభావులు:
“నాన్నగారు అధ్యాపకులు, ఎడిటర్, ఎమ్మెల్సీగా కూడా ఉండటంతోమా ఇంటికి ఎంతో మంది పెద్దలు తరచూ వచ్చిపోతుండే వారు. నాకుగుర్తున్నంత వరకు అలా వచ్చిన వారిలో శ్రీయుతులు జంధ్యాలపాపయ్య శాస్త్రి గారు, విశ్వయోగి విశ్వంజి గారు, ప్రసాదరాయ కులపతి(ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతి పూర్వ నామం), మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ వంటి వారిని దగ్గరగా చూడటం, వారి మాటలు వినడం, వారిఆశీర్వచనం అందుకోవడం నేను చేసుకున్న అదృష్టం. అంతే కాదు, చిత్తూరి నాగయ్య (సినీ నటులు) గారు ఇంటికి వస్తే వారు నా చిట్టిచేతుల్లోని పుస్తకం అందుకుని ఆటోగ్రాఫ్ ఇవ్వడం తలుచుకుంటేఇప్పటికీ ఆనందంగానే ఉంటుంది. అలాగే పుచ్చా పూర్ణానందం (హాస్య రచయిత, సినీ నటులు) గారు మా కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారు. మా పెళ్ళి కి విచ్చేసి ఆశీర్వదించారు.
ఆ నాటి రాజకీయ నాయకుల్లో జూపూడి యజ్ఞనారాయణ గారు, పిడతల రంగారెడ్డి గారు, మండలి వేంకట కృష్ణారావు గారు, భాట్టంశ్రీరాంమూర్తి గారు, విద్యాసాగర్ గారు, రోశయ్య గారు మాట్లాడిన తీరు, వారి లోని రాజకీయ చైతన్యం నన్ను ఆకర్షించాయి. బహూశాఅందుకేనేమో ఇప్పటికీ రాజకీయాలు, వార్తలు - విశ్లేషణలు పట్ల ఆసక్తిమెండుగా ఉంది. శ్రీవారు జర్నలిస్ట్ కావడంతో వారు వ్రాసే వ్యాసాలవిషయంలో సలహాలు, సూచనలు ఇస్తుండటం ఓ అలవాటైంది.”
బాగుందండి, మరి పండుగలు ఎలా జరుపుకునే వారు?
పండుగలు - ఆనందం:
“ఏ పండుగ వచ్చినా ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యేది. బామ్మమరీను. `పిల్లలూ, ఇలా రండర్రా, చేతులు చాపండి, గోరింటాకుపెడతాను' అంటూ నన్నూ నా చెల్లెలు (శార్వాణి)ను పిలిచేది. మేమువెంటనే వెళ్ళకపోతే వెంటబడేది. ఇక అమ్మకి వంట మీద ఆసక్తిఎక్కువ. పండగ వచ్చిందంటే చాలు రకరకాల పిండి వంటలు చేసేది. ఎప్పుడూ వచ్చేపోయే ఇల్లాయే, చేసిన పిండి వంటలు ఒకటి రెండురోజుల్లో ఖర్చయ్యేవి. అమ్మ చేసిన పచ్చళ్లు ముఖ్యంగా నిలవ పచ్చళ్లుబాగున్నాయంటూ కొంత మంది సీసాల్లోకి ఎక్కించుకుని మరీతీసుకుపోయేవారు. అమ్మ నుంచి నాకు కూడా వంటలు చేయడం, రకరకాల పచ్చళ్లు పెట్టడం అలవాటైంది. అమ్మకు మల్లేనే నేనూ పేరుగడించాను. అందుకే శ్రీవారు రిటైర్ అయ్యాక యుట్యూబ్ లో “ఛానెల్5ఏఎం” ఏర్పాటు చేయించి, అందులో “శ్రీదేవి వంటిల్లు” శీర్షికన వారంవారం వివిధ వంటలు ఏలా చేయాలో చూపించేదాన్ని. ఇదంతా పదేళ్లక్రిందటి ముచ్చట. ఆ రోజుల్లో నా వీడియోలు చూసి దేశ విదేశాల్లోనివీక్షకులు ఫోన్లు చేసి మరీ స్పందనలు తెలియజేసేవారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముంగిట పెద్దపెద్ద ముగ్గులువేయాల్సిందే. అలా వేయకపోతే బామ్మ ఊరుకునేది కాదు. “నడుంవంచితేనే అమ్మాయిలకు ఆరోగ్యం “ అంటూ క్లాస్ లు పీకేది. ఈ కాలంఆడపిల్లల్లో చాలా మంది ఇటువంటి పనులకు దూరం కావడంవల్లనేనేమో చిన్నతనంలోనే అనారోగ్యం, ఊబకాయం వంటి వాటితోబాధపడుతున్నారని ఇప్పుడనిపిస్తున్నది”
బాగుంది, ఎలాంటి ఆటలు అప్పట్లో ఆడుకునే వారు?
ఆట పాటలు :
“ఇందాక చెప్పినట్లు చిన్నతనంలో ఆడుకున్న ప్రతి ఆట వెనుక ఆరోగ్యసూత్రాలు దాగుండేవి. తాడాట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూతలు, నాలుగుస్తంభాలాట వంటివి మంచి వ్యాయామం గా ఉండేవి. స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉండటంతోనూ, ఇల్లు కూడా విశాలంగా ఉండటంతోఇంటా బయటా హుషారుగా ఆడుకునేవాళ్లం. ఎదిగే వయసులోఇవన్నీ ముఖ్యమేరా అని బామ్మ అంటుండేది.
ఆనాటి నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఇప్పటికీ అంటే 50 ఏళ్ళు గడిచినప్పటికీ అడపాదడపా అందరం కలుసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది.
పిల్లలు పుట్టాక ఇక వారితోనే లోకమైంది. నాగార్జునావిశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ పట్టా అందుకుని ఉద్యోగంకొన్నాళ్లు చేసినప్పటికీ పిల్లల సంరక్షణకే పెద్ద పీట వేసి గృహిణిగా స్థిరపడ్డాను. పిల్లలకు అమ్మే కదా తొలి గురువు. మా అబ్బాయి రాజేష్ కు, అమ్మాయి దివ్యశ్రావణికి నేనే చదువులో మెళుకువల చెప్పేదాన్ని. ఇద్దరుపిల్లలు చదువుల్లో రాణించి ఇప్పుడు యు.కెలో ఐటీ ఉద్యోగాలుచేస్తున్నారు. మాకు ముగ్గురు మనవళ్లు. వారిని చూడటానికి ఇప్పటికేఐదు సార్లు శ్రీవారితో కలిసి యు.కె వెళ్ళాను. “
యు.కె లో కల్చర్ నచ్చేదా? లేదంటే…?
నా పద్దతి నాదే:
“ఐదు సార్లు యు.కె వెళ్ళినా మన కట్టు బొట్టుని విడనాడలేదు. ఓ సారిచీరలో బయటకు వెళ్ళి ఓ షాపింగ్ మాల్ లో అరుగుమీద కూర్చొంటేఅటుగా వచ్చిన ఇంగ్లీష్ పిల్లలు నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఈ కట్టుబొట్టు వారికి కొత్తగా అనిపించి ఉండవచ్చు. కానీ నా పద్దతి నాదే. ఎవరోఏదో అనుకుంటారని నా అలవాట్లు మానుకోను. మన సంస్కృతి, సాంప్రదాయలను విడిచి దూరం జరగను. అందుకే ఈ మధ్యనే “తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం” అనే వేదికను ఏర్పాటు చేసిదానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను”
మరి ఈ వేదిక తరఫున ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మీ సంకల్పం ఏమిటి?
సాంస్కృతిక వికాసమే మా సంకల్పం
“తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం“ (టిసికెసి) కార్యదర్శి గాఉంటూ విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాను.
ఈ వేదిక తరఫున 2026 జనవరి 26న హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ లోని మెయిన్ హాల్ లో పురస్కారాల మహోత్సవాన్ని నిర్వహించి పదిహేను మంది ప్రతిభా మూర్తులకు పురస్కారాలుఅందజేశాము. పల్లెల్లోని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, ఎంపిక చేసిన పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలనుకుంటున్నాము. చిన్నారుల ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నాము. ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సహిస్తున్నాము. కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలవాలనుకునే వారు 9642721615 (వాట్సప్) కి కాల్ చేయవచ్చు”
నేటి తరం వారికి మీరిచ్చే సందేశం…?
“విద్యకు తోడు వినయం ఉండాలి, ఏ పనిలోనైనా సమాజ శ్రేయస్సుమరచి పోకూడదు. సమాజంలో మంచిని పెంచుదాం- మంచిని పంచుదాం అన్న స్పృహ విడనాడకూడదు”
ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందపరిచే నైజం నూటికినూరుపాళ్లు ఉన్న శ్రీదేవి మరిన్ని విజయాలు సాధించాలని మనసారాకోరుకుందాం.
- అచ్యుతుని రాజ్యశ్రీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి